చొరబాటుదారులను అడ్డుకునేందుకు.. ఆధార్‌పై అస్సాం కఠిన నిబంధనలు

  • అస్సాంలో 18 ఏళ్లు నిండిన వారికి కొత్త ఆధార్ కార్డుల జారీ నిలిపివేత
  • అక్రమ చొరబాటుదారులను నిరోధించేందుకే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం
  • కొన్ని జిల్లాల్లో 100 శాతం మించి ఆధార్ నమోదు కావడంతో అనుమానాలు
  • ఎస్సీ, ఎస్టీ, టీ గార్డెన్ వర్గాలకు మార్చి 2027 వరకు మినహాయింపు
  • 18 ఏళ్ల లోపు పిల్లలకు యథాతథంగా కొనసాగనున్న ఆధార్ నమోదు
అస్సాం ప్రభుత్వం ఆధార్ కార్డుల జారీ ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికి కొత్తగా ఆధార్ నమోదును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారులు ఆధార్ కార్డులు పొందకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిన్న నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జనాభా కంటే అధికంగా, అంటే 100 శాతానికి మించి ఆధార్ కార్డులు జారీ అయినట్లు గుర్తించామని, ఈ అదనపు కార్డులు ఎవరికి జారీ అయ్యాయో నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అక్రమ చొరబాటుదారులు ఆధార్ పొందకుండా కట్టడి చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని సీఎం వివరించారు.

అయితే, అత్యవసర పరిస్థితుల్లో అర్హులైన వారు ఆధార్ పొందేందుకు ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. దీని ప్రకారం, జిల్లా కలెక్టర్ సంబంధిత వ్యక్తి వివరాలను సిఫార్సు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. కాగా, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), మరియు టీ గార్డెన్ కమ్యూనిటీలకు చెందిన వారికి మార్చి 31, 2027 వరకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. 18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేసినప్పటికీ, 18 ఏళ్లలోపు చిన్నారులకు ఆధార్ నమోదు యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.                                

Assam Government
Himanta Biswa Sarma
Aadhaar Registration Rules
Illegal Immigrants
Bangladesh Infiltrators
New Aadhaar Guidelines

More Telugu News